హలో అంతా బాగున్నారా…? ఆ ఏంబాగుంటారులెండి… తిండి కలిగితే కండ కలదోయి అని వెనకటికి ఎవరో మహాకవి అన్నారుటలెండి. ఆ తిండే లేంది ఎలా బాగుంటారు అని అంటే నావుద్దేశ్యం. రేట్లు మండి పోతుంటే ఏంతింటారని మొన్న ఎవరో అంటే విన్నాను. అది ఎంతనిజం…? ఒకప్పుడు వందరూపాయలు తీసుకుని మార్కెట్టుకి వెళితే పెద్ద సంచీ నిండా కూరలు వచ్చేవి, ఇప్పుడు అదే వందతో పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కూడా రావటంలేదు. ఎక్కడదాకానో ఎందుకు నావిషయమే తీసుకోండి. ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదండీ… నేనేనండీ ఇదివరకటి రాములక్కాయ ఇప్పటి టమాటాని… గుర్తు పట్టారా…? కొన్నాళ్ళు పోతే నాపరస్తితి అలాగే తయారైయేట్టుగా వుంది. ఒకప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. నాచెట్టుని పిచ్చి మొక్క అని పీకి పారేసేవాళ్ళు. నన్ను తింటే రోగాలు వస్తాయని భయపడే వాళ్ళు. ఏ మహాతల్లి నాలో రుచిని కనిపెట్టిందో కాని మెల్లమెల్లగా నన్ను తింటానికి అలవాటుపడ్డారు. పులుసుల్లో, చారులో మొదలైన నాప్రస్తానం ఈరోజు నేను లేకుండా ఏకూర వండడానికి ఏఇల్లాలు ఇష్టపడటం లేదు. మొదట్లో కూరలు కొంటే కొసరుగా నన్ను ఇచ్చే వాళ్ళు తరువాత్తరువాత మెల్లగా అమ్మటం మొదలైంది. మొదట్లో కిలో పదిపైసలకి, పదిహేను పైసలకి అమ్మిన నన్ను… ఇప్పుడు కిలో యాబై అరవై రూపాయల కి అమ్ముతున్నారు. అంటే నావిలువ ఎంత పెరిగిందో చూసారా… ప్రస్తుతం సామాన్య ప్రజలకి అందుబాటులో లేను. నన్ను కొనలేక నేను లేకుండా కూరలు వండుకోలేక సామాన్యులు నానా అవస్తా పడుతున్నారు. అంటే కూరల్లో నేనే మహారాజునన్నమాట. ఈమాట తలుచుకొంటే నాకు కొంచం గర్వంగాను కొంచం భయంగాను వుంటుంది. ఎందుకంటే మహారాజ కిరీటం దక్కినందుకు ఆనందం… రాజులు రాజ్యాలు కనుమరుగై పోయినట్లే నేనుకూడ కొన్నాళ్ళకి అలాగే కనుమరుగై పోతానా…? అని దిగులుగానూ వుంటుంది. మళ్ళీ నాకు నేనే సమాధాన పడతాను పెరుగుట విరుగుట కొరకే ధరతగ్గుట హెచ్చుట కొరకే అన్నారుగా. అదితలుచుకుంటూ తృప్తి పడతాను. ఎప్పటికైనా మళ్ళీ ఆపాతరోజులు రాకపోతాయా…